మొదటి పాఠము :
ఆదిని గూర్చిన ఏడు విషయాలు
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. - ఆదికాండము 1:1
ఉపోద్ఘాతం:
ఆది అనే పదాన్ని వివిధ భావాలతో వివిధ పనుల కొరకు వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఉదాహరణకు బట్టలు కుట్టేవారు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఆది ఇస్తే కుడతామని వారు అంటూ ఉంటారు. ఆది అంటే ప్రారంభం, మొదలు, మొదట అనే అర్థములు చెప్పవచ్చు . ఈ పదము గురించి మీకు కొంత అవగాహన ఏర్పడితే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి "ఆది" అనే ఈ పదము మనతో ఏమి మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి !
1. ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడు
దేవుడు అన్నిటి కన్నా ముందు ఉన్నవాడు, అన్ని నాశనం అయిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు.అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. -ప్రకటన గ్రంథం 1:8
ఇక్కడ ఉపయోగించబడిన అల్ఫా ఒమేగాలు, గ్రీకు భాషకు చెందిన అక్షరాలు గా ఉన్నాయి. గ్రీకు భాషలో మొత్తం 24 అక్షరాలు ఉన్నాయి వాటిలో అల్ఫా అనేది మొదటి అక్షరమైతే, ఒమేగా అనేది చివరి అక్షరముగా ఉన్నది. దీనిని బట్టి ఆదియు అంతము ఆయనే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కాక మిగతావి అన్ని మధ్యలో వచ్చి పోయేవే. కాబట్టి మన విశ్వాసము మధ్యలో వచ్చి పోయేవాటి మీద కాకుండా నిత్యుడైన దేవుని మీద ఉంచుట శ్రేష్ఠమైనది.
ప్రియ చదువరి, నీ విశ్వాసం నిత్యుడైన దేవుని మీద ఉన్నదా? లేదా అసత్యమైన, నిత్యము కాని వాటి మీద విశ్వాసముంచుతూ సిగ్గుపడుతూ, నిరాశ చెందుతూ, దిగులుపడుతూ, దిక్కుతోచని స్థితికి దిగజారేవారుగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించుకొని, నిత్య సత్య దేవునిని అన్వేషించి దీవెన పొందేవారుగా ఉండాలని మనవి చేస్తున్నాను.
2. యేసుక్రీస్తు వారు కూడా ఆది అంతము లేనివాడుగా ఉన్నాడు
అపొస్తలుడైన యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను ఈ విధముగా తెలియజేయుచున్నాడు
నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. -ప్రకటన గ్రంథం 22:13
చాలామంది యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో నూతనముగా వచ్చిన వాడిగా భావిస్తారు. ఇలా భావించే చాలామంది ఆయన దేవుడని అంగీకరించనివారుగా ఉంటారు. కానీ ఈ వాక్యము స్పష్టం చేస్తున్న విషయం ఏమిటంటే, ఆయన సృష్టి కంటే ముందున్నవాడు, ఇంకా చెప్పాలంటే సృష్టిలో కూడా ఆయన భాగము పంచుకున్నాడు. ఇదే విషయాన్ని గురించి అపొస్తలుడైన యోహాను తన సువార్తలో ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు…
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. - యోహాను 1:1-3
అంతే కాదు యేసుక్రీస్తు వారు మెల్కిసేదెకు అను క్రమము ద్వారా యాజకుడైన విధానమును గూర్చి పౌలు గారు వివరిస్తూ ఇలా అంటున్నారు
అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. -హెబ్రీయులకు 7:3
3. ఆదిలో దేవుడు సృష్టిని కలుగజేసాడు
మన జీవితంలో దేవునిని మాత్రమే ఎందుకు నమ్మాలి లేదా ఆరాధించాలి అని ఆలోచిస్తే ఆయన నిత్యుడుగా ఉన్నాడు. నిత్యుడైన ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు.
దేవుడు తన శక్తి చేత ఈ లోకమును కలుగజేసాడు. అందుకే కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు...
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. - కీర్తనలు 102:25
ఆదిలో దేవుడు సమస్త సృష్టిని కలుగజేసాడు అని ఎరిగిన మనం ఆది నుండి ఉన్న దేవునిని కాక ఆయన కలుగజేసిన సృష్టిని పూజించడం, ఆరాధించడం ఏమాత్రం సరైనది కాదు. సత్యమును ఎరిగి దానిని తొక్కిపెట్టి కొంతమంది, సత్యమును ఎరుగక ఇంకొంతమంది సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించేవారుగా ఉన్నారు.
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. -రోమీయులకు 1:25
కొన్నిసార్లు దేవుని పోలికలు సృష్టిలో కనబడవచ్చు, ఎందుకంటే దేవుడే సృష్టిలో తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే అవి దేవుళ్ళు కాదు. దేవుడు సృష్టిలో భాగం కాదు ఆయన ఎల్లప్పుడూ సృష్టికి పైనే ఉన్నాడు. ఉదాహరణకు అగ్ని దేవుడు కాదు ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు.
ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు. - హెబ్రీయులకు 12:29వాన దేవుడు కాదు, దేవుడు వర్షమును కురిపిస్తాడు.
జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయుచున్నావు; నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము.- యిర్మియా 14:22
ఇలా చాలా మంది సృష్టికర్తకు, సృష్టికి ఉన్న తేడా తెలియక సృష్టిని పూజిస్తూ, సృష్టికర్తను మరచిపోయినవారుగా ఉన్నారు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజించేవారిలో నీవు కూడా ఉన్నావా? ఒకవేళ ఉంటే అది పాపమని గ్రహించ, క్షమాపణ కోరుకొని, దానిని విడిచిపెట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్తను పూర్ణమనస్సుతో ఆరాధించే వ్యక్తిగా మారవలసియున్నది.
కొంతమంది విశ్వాసుల్లో ఈ సమస్య మరొక కోణంలో కనబడుతున్నది. బహుమానమును ఇచ్చేవానిని విడిచి బహుమతిని ప్రేమిస్తూ దాని వెంట పరుగెత్తుతారు. బహుమతి కంటే బహుమానం ఇచ్చేవాడే గొప్పవాడైనప్పటికి, ఆయనకు విలువ ఇవ్వకపోవడం విచారకరం. హన్నా ఇందుకు చక్కని ఉదాహరణ.
సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను, నా యేలినవాడా, నాయేలిన వాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహో వాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. - 1 సమూయేలు 1:11, 26-28
తాను సమూయేలును బహుమానముగా పొందినప్పటికి, దేవునికి విలువిచ్చి మాటను నిలబెట్టుకున్నది. నీవు ఏ వైపు ఉన్నావ్?? సృష్టకర్త వైపా?? సృష్టి వైపా?? బహుమతి వైపా?? దానిని ఇచ్చేవాని వైపా?? బహుమతి ఇచ్చే వాని వైపు ఉన్నవారు, ఆయన ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా, ఆయన మాతో ఉంటే చాలు అని భావిస్తారు. బహుమానం కోసం చూసేవారు అవి లేకపోతే పొందకపోతే, వాటి స్థానం లో సమస్యలు వస్తే తట్టుకోలేరు. నీ స్థితి ఏంటో ఆలోచన చేసుకొని సత్యమైన, నిత్యమైన వాటి వైపు నిలబడే వ్యక్తి ఉండు.
4. ఆది నుండి దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు
మన మనసులోని భావాలకు రూపం మాటలే. మన దేవుడు మాట్లాడేవాడు, ఏ వ్యక్తి అయినా మాట్లాడకపోతే మౌనంగా ఉంటే ఆ వ్యక్తి ఒక మనసులో ఏముందో మనం ఎప్పటికి తెలుసుకోలేము, దేవుడు ఆదినుండి మాట్లాడుతూ తన అభిలాషను మనుషులకు తెలియపరుస్తున్నాడు
ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను -యెషయా 48:16
ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట తన మాటలు ఉంచి మాట్లాడుతున్నాడని యాజకుడైన జెకార్య మాట్లాడుతున్నారు.
దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. -లూకా 1:72
అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము. -అపో.కార్యములు 3:21
దేవుడు మాట్లాడుతున్నాడు, మరి నీవు వింటున్నావా?? ఆయన మాటలకు నువ్వు లోబడుతున్నావా, ఇప్పుడైనా ఆయన స్వరమునకు లోబడి దేవుని దీవెనకు పాత్రుడు కావాలని విన్నవిస్తున్నాను.
5. ఆది నుండి భవిష్యత్ ఎరిగినవాడు, తెలియజేసినవాడు దేవుడే
దేవుడు సర్వజ్ఞానియై ఉన్నాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలములను ఎరిగిన వాడుగా ఉన్నాడు, ఆది నుండి భవిష్యత్తును గూర్చి తెలియజేస్తున్న వ్యక్తిని నేనే అని యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు.
దేన్నైనా ఒకదాని గురించి తెలియజేయాలి అంటే దాని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి, అంటే దేవుడు భవిష్యత్తు ఎరిగినవాడిగా ఉన్నాడు గనుక దానిని తెలియజేస్తున్నాడు, దేవుడిస్తున్న ఈ ప్రత్యక్షతలు మన కొరకే, ఆయన ప్రత్యక్ష పరచిన విషయాలు గ్రహించి మన జీవితమును అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉన్నది.
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగని వాటిని తెలియజేయుచున్నాను. - యెషయా 46:10
నీ భవిష్యత్తు ఏమిటో కూడా ఆయనకు తెలుసు, కాబట్టి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దిగులు చెందక, దానిని తెలుసుకున్నందుకు లోక సంబంధమైన పద్ధతులను అవలంబించక, సువర్ణ అక్షరాలతో ఆయన నీ భవిష్యత్తును లిఖించి ఉండగా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుని దీవెన పొందాలని మనవి చేస్తున్నాను .
6. ఆది నుండి దేవుడు మానవులను పిలచువాడుగా ఉన్నాడు.
ఆదిలో మనుషులను కలుగజేసిన దేవుడే, వారికి రకరకాల పనులు కల్పించినవాడుగా, ఏర్పాటు చేసినవాడుగా ఉన్నాడు. ఆయన వారిని రకరకాల పనులు కొరకు పిలిచినవాడుగా ఉన్నాడు.
ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను. -యెషయా 41:4
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విధానమును బట్టి చూస్తే ఆయనే ప్రతి మనిషిని ఒక్కో పని కొరకు పిలిచి వారు ఆ పని పూర్తి చేయు వరకు లేదా వారి జీవితం అంతము వరకు వారితో ఉండేవాడుగా ఉంటాడు. వారు దేవునిని విడిచి వెళ్ళవలసిందే గాని దేవుడు వారిని విడువడు.
దేవుడు మానవులను ఎందుకొరకు పిలుచుచున్నాడు??
రక్షణ పొందునట్లుగా పిలుచుచున్నాడు.
లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ పిలుపునిస్తున్నాడు, ఆయన వైపు చూచి రక్షణ పొందాలని ఆయన పిలుస్తున్నాడు, ఒక వ్యక్తికి తన పాపము నుండి విడుదల కలగాలంటే అది యేసుక్రీస్తు వారి వైపు ఆయన సిలువ వైపు చూస్తే తప్ప మరెక్కడా కలగదు.
భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. -యెషయా 45:22
ప్రత్యేక పని కొరకు పిలుచుచున్నాడు.
దేవుడు బెసలేలును ప్రత్యక్ష గుడారం పని కొరకు పిలిచాడుచూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. - నిర్గమకాండము 31:2
తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను. - కీర్తనలు 78:70
కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను. -యెషయా 44:28
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. -యెషయా 45:1
నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును-యెషయా 45:13
వెలుగులోనికి పిలుచుచున్నాడు
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. -1 పేతురు 2:9
చీకటిలో ఉన్న మానవాళిని అనగా పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని తన వెలుగులోనికి అనగా సత్యములోనికి తన గుణములను ప్రచురించడానికి మనలను పిలుస్తూ ఉన్నాడు.
వెలుగు అనగా ఏమిటి?
వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. -ఎఫెసీయులకు 5:9
దేవుడు నిన్ను ఎందుకొరకు పిలిచాడో లేదా పిలుచుచున్నాడో తెలుసుకొని, ఆ పిలుపుకు స్పందించి, ఆయన నియామకంలో జీవించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన పిలిచిన పని కొరకు ఆయన ఇచ్చిన సామర్ధ్యంతో ఆయన కొరకు జీవించే వ్యక్తిగా ఉండుటకు తీర్మానం చేసుకో!!!
7. మృతిని గెలిచిన ఆదిసంబూతుడు
మృతులలో నుండి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు వారు మొదటి వారు, ఆయన అలా తిరిగి లేచాడు గనుక మనమును ఒక రోజున తిరిగి లేస్తామని విశ్వసించి, ఈ జీవితం వ్యర్థం కాదని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఈ లోకంలో జీవిద్దాం.
నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. -ప్రకటన గ్రంథం 1:5
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. - 1 కోరింథీయులకు 15:58
ముగింపు :
మన దేవుడు నిత్యుడని, ఆయనే ఆదిలో ఈ సృష్టిని కలుగజేసాడని, ఆయన ఆది నుండి మాట్లాడేవాడుగా ఉన్నాడని, ఆయన ఆది నుండి సర్వజ్ఞానము కలిగినవాడై భవిష్యత్తును గూర్చిన ప్రత్యక్షతలు అనుగ్రహిస్తున్నవాడని,ఆయన ఆది నుండి మానవులను పిలుస్తూ వారి రకరకాలైన పనులు ఇస్తున్నాడని, మృతిని గెలిచి తిరిగి లేచిన వారని ఆయన మొదటి వాడని, గ్రహించి, ఆయనపై విశ్వాసం ఉంచుతూ, ఆయన నిన్ను కలిగించిన కారణమును నెరవేరుస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయనకు అప్పగించుకుంటూ, ఆయన ఇచ్చిన పిలుపుకు లోబడి నమ్మకంగా కొనసాగుతూ, ఆయన రాకడలో తిరిగి లేపబడి పరలోక రాజ్యమును పొందేవారంగా ఉందాం!
పునర్విమర్శ :
- ఆదిని గూర్చిన ఏడు విషయాలు ఏంటి?
- దేవుని యందు మాత్రమే మనం ఎందుకు విశ్వాసముంచాలి?
- ఆల్ఫా ఒమేగా అంటే అర్థం ఏమిటి? గ్రీక్ భాషతో దీనికున్న సంబంధమేంటి? దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలి?
- మెల్కిసేదెకుకు యేసుక్రీస్తు వారికున్న ఏడు పోలికలు రాయండి?
- " దేవుడు సృష్టిలో భాగం కాదు" వివరించండి?
- దేవుడు మానవులను పిలుచుచున్న మూడు అంశాలు రాయండి?
- యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడిన మూడు ఆహ్వానాలు ఏమిటి?
- ప్రత్యేక పని కొరకు దేవుడు పిలుచుకున్న ముగ్గురు వ్యక్తుల పేర్లు తెలపండి?
- చీకటి అంటే మీకేం అర్థమైంది?
- చనిపోయి బ్రతికింపబడిన వారిలో ఎంతమందిని గూర్చి బైబిల్ ప్రస్తావిస్తున్నది?






కామెంట్ను పోస్ట్ చేయండి