ఆజ్ఞాపించు దేవుడు (ఆదికాండము 1-8)
మన దేవుడు ఆజ్ఞాపించేవాడు, ఆయన ఆజ్ఞ అధికారము గలది. మానవుని అధికారానికి ఆజ్ఞలకు పరిమితులు ఉంటాయి గాని దేవుని అధికారానికి ఆజ్ఞకు పరిమితులు లేవు.
దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుంది.
నేడు మనం చూస్తున్న ఈ సృష్టినంత దేవుడు శూన్యంలో నుండి కలుగజేశాడు. మొదటి దినాన ఆయన వెలుగును కలుగజేసే సమయంలో " వెలుగు కలుగును గాక" అన్నాడు. అది ఒక ఆజ్ఞ.
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. -ఆదికాండము 1:3
ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. -కీర్తనలు 33:9
ఆదికాండం మొదటి అధ్యాయం మూడో వచనాన్ని కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ లో ఇలా అనువాదం చేయడం జరిగింది.
God said, “I command light to shine!” And light started shining. - Genesis 1 : 3 (CEV)
దేవుడు ఆఙ్ఞాపిస్తే ఉనికిలో లేనివెన్నో మనుగడలోనికి వచ్చాయి. ఆయన ఆజ్ఞాపించగా ఆకాశ విశాలము, భూమి, చెట్లు, సూర్య చంద్ర నక్షత్రాలు, జలచరములు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఏర్పడినవి. దేవుడు కలుగును గాక అని చెప్పగానే ఇవన్నీ ఏర్పడినవి. దేవుని ఆజ్ఞ అసమానమైన అధికారముగలది. నీ జీవితంలో లేమిని అనుభవిస్తున్నావా? చీకటి అనుభవిస్తున్నావా? సంక్షోభం అనుభవిస్తున్నావా? ఆజ్ఞాపించే దేవుని వైపు చూడు! కోరహు కుమారులు కోరుకున్నట్టుగా, నా జీవితంలో కూడా ఆజ్ఞాపించమని దేవునిని అడుగు.
దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. -కీర్తనలు 44:4
అడిగేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకో! ఆయన ఆజ్ఞ అసాధారణమైన కార్యములను చేస్తుంది. దేవుడు ఆజ్ఞాపించలేని అంశాలు అంటూ ఏమీ లేవు, నీవు విశ్వాసముంచగలిగితే అన్నియు సాధ్యమే.
దేవుడిలా తన ఆజ్ఞ చేత సృష్టిని కలుగజేసి, మనిషిని మాత్రం తన నోటి మాటతో కాక తన రూపంలో చేతితో నిర్మించాడు. వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేసి వారి కొరకు ఏదేను అనే ఒక తోటను ఏర్పరిచి దానిని సేద్యపరచమని, కాయమని చెప్పాడు.
ఆ తోట మొత్తాన్ని అనుభవించే అవకాశం వారికి ఇచ్చాడు, ప్రతి దినము ఆయన వారితో సహవాసం చేస్తూ సంభాషిస్తూ సంతోషంగా వారి జీవితము కొనసాగునట్లు చేశాడు. అయితే ఒక రోజున దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. -ఆదికాండము 2:16,17
అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ఆజ్ఞను ఇవ్వడం వెనక దేవునికున్న ఉద్దేశం ఏంటి? వారు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి , దేవుడు ఈ ఆజ్ఞ ఇవ్వటం జరిగింది.
దేవుని ఆజ్ఞలకు లోబడటమే ఆయనను ప్రేమించడం
దేవునిని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలకు లోబడతారు. దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను చులకనగా భావించేవారు, తిరుగుబాటు స్వభావం కలిగినవారే. వారు నిజానికి దేవుని కంటే మరేదో ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. -1 యోహాను 5:3
దేవుడు భారమైన ఆజ్ఞలేవి, మనము పాటించలేని ఆజ్ఞలేవి మనకివ్వడు మన మీద పెట్టడు. దేవుడు ఇక్కడ ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆజ్ఞ కూడా భారమైన ఆజ్ఞ కాదు. తోట మొత్తాన్ని వారి చేతిలో పెట్టి ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము జోలికి మాత్రం వెళ్ళొద్దన్నాడు. ఆయన చెట్టు జోలికి వెళ్లొద్దు అనడానికి, ఆ చెట్టు చెడ్డది అనేది కారణం కాదు. ఆ చెట్టు వల్ల గాని పండు వల్ల గాని చెడు ఏమీ జరగదు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మంచిదే.
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. -ఆదికాండము 1:31
ఆ చెట్టులో చెడు ఏమీ లేనప్పుడు, దేవుడు ఎందుకు తినవద్దన్నాడు? ఆయన దేవుడు గనుక. ఆయన చేత మనం సృజింపబడిన వారము కనుక. మనం ఏది తినాలో ఏది తినకూడదో ఆయనే నిర్ణయిస్తాడు. మనం ఆయన ఆజ్ఞకు లోబడవలసిందే.
అయితే ఆదాము హవ్వలు ఈ విషయంలో విఫలమయ్యారు, తమను ఎంతగానో ప్రేమించి తమకు జీవమును జీవితమును అనుగ్రహించిన దేవునిని ఆయన ఆజ్ఞను చులకనగా భావించి దానిని మీరినవారుగా ఉన్నారు. ఇందులో ఆదాము హవ్వలు ఈ విధంగా తప్పిపోవడానికి సాతాను ఒక కారణమయ్యాడు.
సాతాను పామును ఆవహించి (ఇక్కడ పాము కూడా చెడ్డది కాదు, సాతాను ఒక జంతువుని గాని మనిషిని గాని ఆ విధంగా ఆవహించగలదు, కాని పరిశుద్ధాత్మ మనుషులలో మాత్రమే నివసిస్తాడు) హవ్వతో మాట్లాడి , మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండ్లు ఆదాము హవ్వలు తింటే వారి కన్నులు తెరవబడి మంచి చెడ్డలు ఎరిగినవారై దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసు గనుక మీకు ఆ పండు ఆయన తినే అవకాశం ఇవ్వలేదు అని చెప్పాడు.
ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా -ఆదికాండము 3:5
సాతాను ఈ అబద్ధాలు చెప్పడం కొత్తమి కాదు, ఇప్పటికీ అవే అబద్ధాలు మన చెవులలో చెప్తూ ఉన్నాడు. మనము దేవునిని ప్రేమించనివ్వకుండా చేయడానికి, ఆయన నుండి మనలను ఏ విధంగానైనా దూరం చేయడానికి, ఆయన ఆజ్ఞలకు అవిధేయులను చేయడానికి, ఆయనను అపార్థం చేసుకోవడానికి, ఈ అబద్ధాలు మోసపు మాటలు మన చెవిలో మోగిస్తూనే ఉన్నాడు.
ప్రేమగల దేవుని కార్యాలు ఓ వైపు కనబడుతూనే ఉన్నాయి, ప్రేమపూర్వకమైన ఆయన మాటలు మరొక్క వైపు వినబడుతూనే ఉన్నాయి, కానీ మనిషి మాత్రం కీడే తప్ప మేలే మాత్రం చేయలేని సాతాను మాటలపై నమ్మకముంచుతూ, దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తూ కొనసాగే వాడుగా ఉన్నాడు.
సరిగ్గా హవ్వ కూడా అదే చేసింది, సాతాను మాటలు విన్న తర్వాత దేవుడు తన యొద్ద నుండి ఏదో దాచిపెడుతున్నాడని భావించింది, తన పట్ల దేవుడు చూపిన ప్రేమను అర్థం చేసుకోక, తాను దేవునిని ప్రేమించడం విస్మరించి ఆజ్ఞకు అవిధేయరాలై దేవుడు తినవద్దని చెప్పిన పండును తిన్నది. ఇక్కడ పండు తినడం గొప్ప విషయం కాదు గానీ ఆజ్ఞను మీరడమే ముఖ్యమైన విషయం.
ప్రియ సహోదరి, సహోదరుడా నీ జీవితంలో దేవునిని ప్రేమిస్తున్నావా? అయితే నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో, ప్రేమతోనే ఆయన నీకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు, నీవు నాది నాది అని చెప్పుకునే ప్రతి దేవునిదే.
ఇంతగా నిన్ను ప్రేమించిన దేవునికి నీవు చూపుతున్న ప్రేమేది? దేవుని ఆజ్ఞలను నీవు భారమని ఎంచుతున్నావా? దేవుని ఆజ్ఞలను చులకనగా చూస్తున్నావా? నిజంగా నువ్వు దేవునిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించు.
ప్రేమకు పెట్టబడిన పరీక్షలో విఫలమైన ఆదాము హవ్వలు వారి జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు, దేవుని ఎదుటకి రాలేకపోయారు, తోట నుండి పంపించి వేయబడ్డారు, మంచి చెడ్డలు ఎరగని అమాయకత్వం నుండి, ఊహించుటకు, వివరించుటకు సాధ్యము కాని ఘోరమైన చెడుతనము కలిగినవారుగా మారిపోయారు.
వారి పతనస్థితినే, చెడుతనాన్ని వారసత్వంగా ఈ లోకానికి ఇచ్చారు, వారి పిల్లలు అదే దారిలో పయనిస్తూ ఒకరిని ఒకరు చంపుకోవడం, విచ్చలవిడిగా కామాభిలాషను నెరవేర్చుకోవడం చేస్తూ దేవునిని ప్రేమించుట అంటే ఏంటో పూర్తిగా మరిచిపోయి ఈ లోకమును చెడుతనముతో నింపివేశారు.
జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన దేవునికి వారి జీవితాల్లో చోటే లేకుండా పోయింది. ఈ లోకము చెడిపోయిన స్థితిని చూచి దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. దేవుడంటే భక్తి కలిగి దేవుని కోసం జీవించే వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారా అని వెతికితే చెడుతనము కలిగిన ఆ తరములలో నోవాహు అనే ఒక్కడు మాత్రమే దొరికాడు.
దేవుని ఆజ్ఞకు లోబడుట ద్వారా మేలు కలుగుతుంది.
దేవుడు నోవాహుని పిలిచి నోవాహుతో ఈ విధంగా చెప్పాడు, భూమ్మీదికి తాను జల ప్రళయం తీసుకురాబోతున్నానని, చితిసారకపు మ్రానుతో తన కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని, అందులో ఉండవలసిన అంతస్తులు, దానిలోనికి చేర్చవలసిన జంతువులు పక్షులు వాటి ఆహార పదార్థాలన్నిటిని గూర్చి ఆయనకు ఆజ్ఞాపించడం జరిగింది.
నోవాహుకు దేవుడు ఇక్కడ చాలా పెద్ద పనే పెట్టాడు, దేవునిని ఎరగనివారు ఉన్న ఆ తరంలో నోవాహు, నోవాహు యొక్క కుటుంబం మాత్రమే అంత పెద్ద ఓడను నిర్మించడం, ఈ మధ్యలో అనేకులు మాట్లాడే హేళన మాటలు భరించడం, చాలా పెద్ద కార్యమే.
నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. -ఆదికాండము 6:22
నోవాహు జీవితంలో ఎన్నడూ చూడని వర్షం, జలప్రళయం అనే విషయాలు తనకు అర్థమైనా, కాకపోయినా, దేవుడు చెప్పాడు కనుక దానిని నమ్మాడు, విశ్వాసంతో విధేయత చూపుతూ దేవుడు ఆజ్ఞాపించినదంతా నెరవేర్చాడు.
హవ్వకు విశ్వాసం లేకపోవడమే ఆమె అవిధేయతకు కారణమైంది, నోవాహు యొక్క విశ్వాసమే ఆయన విధేయతకు మూలమైంది. నీ జీవితంలో నీవు నిజంగా దేవునిని ప్రేమిస్తే, ఆయన నిన్ను ఈ లోకంలో ఉన్నవాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని గ్రహిస్తే నీవు తప్పకుండా దేవునియందు విశ్వాసం ఉంచుతావు, ఆయన మేలు చేసేవాడని అర్థరహిత కార్యాలు చేసేవాడు కాదని నమ్మి నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన కార్యములకు ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి అప్పగించుకుంటావు.
నోవాహు దేవుని ఆజ్ఞకు లోబడి ఓడను నిర్మించగా, దేవుడు భూమ్మీదికి తీసుకువచ్చిన గొప్ప జల ప్రళయం నుండి తనను తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. నోవాహు కూడా దేవుని ఆజ్ఞలకు అవిధేయుడైతే, జలప్రళయంలో నశించిన వారిలో ఒకడిగా మిగిలిపోయేవాడే.
దేవుని ఆజ్ఞకు లోబడిన నోవాహును దేవుడు జలప్రళయం లోనూ ఓడలోను కాపాడి రక్షించాడు. 40 దినాలు పాటు భూమ్మీద వున్న గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోయేంత వర్షం కురిసినప్పటికీ, దాదాపు సంవత్సరానికి పైగా ఓడలో నోవాహు ఉండవలసివచ్చినప్పటికీ దేవుడు ఆయనను సురక్షితంగా ఉంచాడు.
నీవు కూడా దేవుని ఆజ్ఞకు లోబడితే ఆయన గొప్ప కార్యములు నీ జీవితంలో చూడగలుగుతాం, ఆయన మేలులను ఖచ్చితంగా అనుభవిస్తావు. దేవుని ఆజ్ఞ ఫలితమే ఈ సృష్టి, మానవుని అవిధేయత ఫలితమే పతనస్థితి, నోవాహు విధేయత ఫలితమే శేషించబడిన మనమందరము మరియు మిగిలి ఉన్న ప్రాణులు.
సృష్టిలో ఉన్న ప్రతి దానికంటే ఎక్కువగా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు జీవాన్ని జీవితాన్ని మాత్రమే కాక, ఆదాము హవ్వలా పతనం మూలంగా కలిగిన పాపపు స్థితి నుండి విడిపించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి ఆయన పంపాడు.
దేవుని ప్రేమను ఇకనైనా గుర్తించి, లోకమును పాపమును ప్రేమించడం మాని, శ్రద్ధతో ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ఆయన యొద్దకు నీవు పరిగెత్తి వస్తే నోవాహు వలె దేవుడు నిన్ను కూడా దీవించి కాపాడుతాడు.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.. -ద్వితియోపదేశకాండము 28:1

కామెంట్ను పోస్ట్ చేయండి